కూరగాయల సాగు.. లాభాలు బాగు
వర్షాలు తగ్గిపోవడంతో పంట మార్పిడి విధానాన్ని ఎంచుకున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన రైతు దంపతులు కూరగాయల సాగుతో మంచి ఆదాయం పొందుతున్నారు. 17 ఎకరాల్లో బీరకాయ, కాకరకాయ, టమాట, క్యాబేజీతో పాటు బంతిపూలను సాగు చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ పద్ధతులతో సాగు చేపట్టి ఇప్పటివరకు 15 సార్లు దిగుబడి పొందారు. బీరకాయ 13 టన్నులు, కాకరకాయ 7 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడులు పోను సుమారు రూ.6 లక్షల నికర ఆదాయం సాధించారు.
వర్షాలు సరిగా కురవకపోవడంతో పంట మార్పిడి విధానాన్ని అనుసరించి కూరగాయల సాగు చేపట్టిన రైతు దంపతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన ఘంటా మాధవి, అశోక్రెడ్డి దంపతులు 9 ఎకరాల సొంత భూమితో పాటు మరో 8 ఎకరాలను కౌలుకు తీసుకుని మొత్తం 17 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పత్తి, పసుపు, వరితో పాటు మూడు ఎకరాల్లో బీరకాయ, రెండున్నర ఎకరాల్లో కాకరకాయ, 30 గుంటల్లో టమాట, 10 గుంటల్లో క్యాబేజీ, మరో 30 గుంటల్లో బంతిపూలను సాగు చేశారు. 10 గుంటల్లో బోడ కాకరకాయ సాగు చేసినప్పటికీ అది మొలకెత్తలేదు.
విత్తనాల కొనుగోలు, తాత్కాలిక పందిళ్లు, డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ పేపర్ వంటి పద్ధతులతో సుమారు 75 రోజుల క్రితం కూరగాయల సాగును ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ తీసుకోకుండా దాదాపు రూ.8 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఇప్పటివరకు 15 సార్లు పంట దిగుబడి వచ్చింది. ఇందులో 13 టన్నుల బీరకాయ, 7 టన్నుల వరకు కాకరకాయ దిగుబడి సాధించారు.
మహబూబాబాద్, వరంగల్ మార్కెట్లకు కూరగాయలను తరలించి విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడులను మినహాయించి సుమారు రూ.6 లక్షల వరకు నికర ఆదాయం పొందారు. టమాట ప్రస్తుతం కాయ దశలో ఉండగా, బంతిపూలు కూడా పూస్తున్నాయి. రబీ సీజన్ వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. సేంద్రీయ ఎరువులను ఉపయోగించడం వల్ల దిగుబడి బాగుందని వారు చెబుతున్నారు.





