17 Sep 2026, Thursday
జాతీయం

శ్రీదేవి ఆస్తి వివాదం.. బోనీ కపూర్ కుటుంబానికి సుప్రీంకోర్టు నోటీసులు

By PRAJA NADU Desk 17 Sep 2026, 12:00 PM Updated: 17 Sep 2026, 12:02 PM 1 views
దివంగత నటి శ్రీదేవికి చెందిన చెన్నై భూమి వివాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. 1988లో శ్రీదేవికి విక్రయించిన 2.7 ఎకరాల భూమిలో తమకూ వాటా ఉందంటూ ఎంసీ శివగామి, ఎంసీ నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌పై బోనీ కపూర్, జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు భూమిపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది.
దివంగత సినీ నటి శ్రీదేవికి చెందిన ఆస్తి వివాదం మరోసారి చర్చకు వచ్చింది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న 2.7 ఎకరాల భూమికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 1988లో శ్రీదేవికి విక్రయించిన ఈ భూమిలో తమకూ వాటా ఉందంటూ ఎంసీ చంద్రశేఖరన్ కుమార్తె ఎంసీ శివగామి, కుమారుడు ఎంసీ నటరాజన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదాస్పద ఆస్తిలో తమకు హక్కు ఉందని పేర్కొంటూ వారు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈ కేసు మద్రాస్ హైకోర్టు పరిధికి వెళ్లింది. పిటిషనర్లు తాము చంద్రశేఖర్ వారసులమని, ఆయన తమ కన్న తండ్రి అని కోర్టుకు తెలిపారు. వివాదాస్పద భూమిని ఐదు సమాన భాగాలుగా విభజించి, అందులో 1/5వ వంతు వాటా తమకు కేటాయించాలని వారు కోరారు. అలాగే 1988 ఏప్రిల్ 19న రాజేశ్వరి, శ్రీలత, శ్రీదేవికి అనుకూలంగా అమలు చేసిన సేల్ డీడ్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ దావా గడువు ముగిసిపోయిందని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో మద్రాస్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కపూర్ కుటుంబం తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పిటిషనర్లు దాఖలు చేసిన దావాకు చట్టబద్ధత లేదని ఆయన వాదించారు. 1988లోనే ఆస్తి విక్రయం పూర్తయిందని, చాలా కాలం తర్వాత ఈ వివాదం తెరపైకి వచ్చిందని పేర్కొన్నారు. శ్రీదేవి మరణం తర్వాత 2023లో ఆస్తి మ్యుటేషన్ కోసం కపూర్ కుటుంబం దరఖాస్తు చేసుకున్న తర్వాతే పిటిషనర్లు కేసు దాఖలు చేశారని అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ వరకు ఆ భూమిపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అలాగే ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని పరిశీలించాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 18కు వాయిదా వేసింది

Related Stories