పాక్ నుంచి అక్రమ రవాణా.. 362 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూరాలు సీజ్
పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్కు తరలించిన 362 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూరాలను డీఆర్ఐ అధికారులు నాసిక్లో సీజ్ చేశారు. ముంబైకి చెందిన ఓ సంస్థ వీటిని దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు. పాక్ మూలాన్ని దాచేందుకు యూఏఈకి చెందిన ఖర్జూరాలుగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
పాకిస్థాన్ నుంచి భారత్కు అక్రమంగా తరలించిన భారీ ఎండు ఖర్జూరాల సరుకును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు నాసిక్లో సీజ్ చేశారు. మొత్తం 362 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సరుకును ముంబైకి చెందిన ఓ సంస్థ దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు. అక్రమ రవాణాపై సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు నిర్వహించి సరుకును పట్టుకున్నారు.
పాక్లో ఉత్పత్తి అయిన ఎండు ఖర్జూరాల అసలు మూలాన్ని దాచిపెట్టేందుకు తప్పుడు డాక్యుమెంట్లు రూపొందించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ సరుకును యూఏఈకి చెందిన ఖర్జూరాలుగా చూపించేలా పత్రాలు సృష్టించినట్లు గుర్తించారు. మొదట పాకిస్థాన్ నుంచి సరుకును యూఏఈలోని జబేల్ అలీ పోర్టుకు తరలించి, అక్కడి నుంచి మరో నౌక ద్వారా భారత్కు పంపినట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు.
పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్ నుంచి దిగుమతులపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇతర దేశాల మీదుగా పాక్ సరుకును భారత్కు అక్రమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. ఇలాంటి అక్రమ దిగుమతులను అడ్డుకునేందుకు డీఆర్ఐ ‘ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్’ పేరుతో ప్రత్యేక చర్యలు కొనసాగిస్తోంది. ఇతర దేశాల మార్గం ద్వారా వస్తున్న అనుమానాస్పద పాక్ దిగుమతులను గుర్తించి స్వాధీనం చేసుకునే చర్యలు చేపడుతోంది





